మత్తుమాటల మహమ్మారి


తస్మాత్… తాగినోడు వస్తున్నాడు

తూగుతూ తుళ్ళుతూ –

రహదారికే వంపు పెట్టినట్టుగా

అడుగులు వేసుకుంటూ!


మత్తెక్కిన మాటలు – మంత్రాలట!

మత్తుదిగిన మాటలు – మహావాక్యాలట!

తొక్కతోలు మాటలు – తత్త్వమట!

బూతు మాటలు – బుద్ధిజీవుల భాషట!


“నేనే తోపు” అంటాడు,

తోచిన పలుకులను తూలుతాడు.

“నేనే తొండి” అంటాడు,

తెగిన బుద్ధికి బిరుదులు పెట్టుకుంటాడు.


చేయని ఇతరుల ఘనకార్యాలు  

చెప్పుకుంటాడు తనవని, 

చేసిన దుష్టకార్యాలనుండి  

తప్పించుకుంటాడు తనవికాదని. 


చిల్లర మాటలు చిధ్రాలై,

అల్లరి మాటలు వ్యర్థాలై –

వినేవాళ్ల చెవుల్లో

విసిరేసిన గులకరాళ్లై పడతాయి!


మిత్రుల్ని మిథ్యగా ముద్దాడి,

శత్రువుల్ని శ్లోకాలతో శపించి,

తన అజ్ఞానానికి

తానే పెద్ద పీఠం వేసుకుంటాడు.


ఇది మాటల మద్యం కాదు –

మద్యం మింగిన మాటల మహమ్మారి!

ఇది నవ్వుల వినోదం కాదు –

సమాజానికి సంక్రమించే వ్యాధి!


కాబట్టి వినండి పౌరులారా –

తాగినోడు చెప్పే తత్త్వం

తాగిన గ్లాసులోనే వదిలేయండి,

తాగిన నోటిలోనే మూసేయండి!


ఎందుకంటే…

స్పృహ లేని మాటలు సత్యం కావు,

సమాజానికి వెలుగుకాదు –

వాటికి దూరమే నిజమైన జాగ్రత్త!


గల్తీగాళ్ళను గమనించి 

పారాహుషారుకాండి,

కల్తీగాళ్ళకు ఖబడ్దారుచెప్పి

జాగరూకతవహించండి.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog