అంధ్రాక్షరాలకు అమృతాభిషేకం
(అంధ్రాష్టదేవతల ఆరాధనం)
ఓంకార నాదమున పుట్టిన
తెలుగు తల్లి అక్షరాలు —
మూడు ఖండాలై విరిసాయి,
అష్ట వాగ్దేవతలై వెలిగాయి.
యాబది ఆరు అక్షరాల ఆంధ్రం
త్రికండ్రికల సమూహం,
అ నుండి అః వరకు — చంద్ర ఖండం
శీతల స్వరాల శృంగారం.
క నుండి భ వరకు — సౌర ఖండం
వ్యంజనాల తేజోమయ రాజ్యం,
మ నుండి క్ష వరకు — అగ్ని ఖండం
ఉచ్చారణ ఉష్ణత, అర్థాల అంగారకం.
అచ్చుల ఆకాశంలో
వాగ్దేవత వశని విహరించింది.
ఉచ్చారణకు ఉయ్యాలలూపి,
భావాలు, మాటలు మనసుకు వశం చేసింది.
క వర్గానికి కామేశ్వరి
ఆకర్షణ అంగరంగభోగం అద్దింది.
చ వర్గానికి మోదిని
మాధుర్య మంత్రాలు చల్లింది.
ట వర్గానికి విమల
శుద్ధ శబ్ద శిఖరాలు నిర్మించింది.
త వర్గానికి అరుణ
ఉషస్సుల వెలుగులతో తేజస్సు ఇచ్చింది.
ప వర్గానికి జయని పలుకుల్లో
పరాక్రమం నింపి, తెలుగును విజేతగా నిలిపింది.
యరలవలకు సర్వేశ్వరి సమగ్ర శైలిని ప్రసాదించి,
భాషను సమన్వయ శిల్పంగా మలిచింది.
కడపటి అక్షరాలందు -
కౌలిని అవతరించి,
రహస్య రసాలను రగిలించి,
అక్షరాలకు తంత్రతేజం చేకూర్చింది.
చంద్ర ఖండం — మాధుర్యం, సౌర ఖండం — తేజస్సు,
అగ్ని ఖండం — సృష్టి శక్తి, ఈ మూడు ఖండాల నడుమ
అష్ట దేవతలు నర్తించగా,
తెలుగు భాష దైవవాక్కుగా అవతరించింది.
నా కలం — వశని ఆశీర్వాదం, కామేశ్వరి ఆకర్షణం,
మోదిని మాధుర్యం, విమల పవిత్రం,
అరుణ ప్రకాశం, జయని విజయం,
సర్వేశ్వరి సమగ్రం, కౌలిని గూఢతత్త్వం.
అష్టదేవతల అర్చనలో
ఆంధ్రావాక్కులకు వందనం,
అమర తెలుగుమాతకు
అక్షరామృత అభిషేకం.
ఇవన్నీ కలిసినప్పుడు —
నేను రాసేది కవిత కాదు,
అవుతుంది అది అప్పుడు -
అక్షర అష్టదేవతల ఆరాధనము.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment