అక్షరాల ఆవిర్భావం… కవితలు రాద్దామనుకున్నా — కాగితం ఎదురు చూసింది, కలం చేతివ్రేళ్లలోకి దూరింది, మనసు మాటలను కుమ్మరించింది। కవితలు వినిపిద్దామనుకున్నా — గుండె గర్భంలో గుసగుసలు మోగాయి, గొంతు తలుపులు తెరుచుకున్నాయి, నిశ్శబ్దమే నాదమై శ్రావ్యతను చిందించింది। తేటపలుకుల తేనెచుక్కలు చల్లుదామనుకున్నా — పదాలు పరిమళాలై పూచాయి, పలుకులు పూలవానై కురిశాయి, పంక్తులు మాధుర్యమై ముందుకొచ్చాయి। కవనాలను ప్రచార మాధ్యమాలకు పంపుదామనుకున్నా — ఆలోచనలు రెక్కలు తొడుక్కొన్నాయి, అక్షరాలు ఆకాశానికి ఎగిరాయి, లోకాన్నంతా పలకరించి పులకరింపజేశాయి। కమ్మగా పాడుదామనుకున్నా — రాగాలు చిరుజల్లులై జారాయి, భావాలు గానస్వరాలై మారాయి, మనసులను మత్తెక్కించాయి। పాఠక హృదయాలను తట్టాలనుకున్నా — అక్షరం ఒక్కటే చాలు అనిపించింది, ఆత్మను తాకే పలుకు, అమృతంలా జారిపడింది। కవితలు అనేవి — కలం రాసిన గీతలు కావు, మనసుల్ని ముట్టే మాధుర్యాలు, లోకాన్ని ఓలలాడించే గాంధర్వ గానాలు॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం