కవితా భాగ్యము
అన్ని ద్వారాలు — ఒకేసారి తెరుచుకుంటున్నాయి,
అన్ని దారులు — ఒకేచోటకు చేరుస్తామంటున్నాయి.
అన్ని అక్షరాలు — ఒకేలయలో కూరుతున్నాయి,
అన్ని పదాలు — ఒకేభావం పలుకుతున్నాయి.
అన్ని కలాలు — ఒకేశైలిలో రాస్తున్నాయి,
అన్ని గీతాలు — ఒకేకంఠంతో పాడుతున్నాయి.
అన్ని మదులు — ఒకేసారి చదవాలంటున్నాయి,
అన్ని హృదులు — ఒకేతీరున మురిసిపోతున్నాయి.
అన్ని రుచులు — ఒకేపట్టున ఆరగించమంటున్నాయి,
అన్ని రసాలు — ఒకేతడవున ఆస్వాదించమంటున్నాయి.
అన్ని అందాలు — ఒకేమారు దర్శనమిస్తున్నాయి,
అన్ని ఆనందాలు — ఒకేసారి తడుముతున్నాయి.
నా మాటలకు — చప్పట్లవర్షం కురుస్తోంది,
నా చేతలకు — ప్రశంసాపుష్పాలు అందుతున్నాయి.
నా అదృష్టం — పొంగిపొర్లి పరవశిస్తోంది,
నా భాగ్యం — గగనమంతా ఎగసిపోతోంది.
కవితే నా భాగ్యం – కాగితంపై పూసిన పరవశ పుష్పం,
కవితే నా ధ్యేయం – పాఠకుల ఎదల్లో కలిగించే ప్రభంజనం.
కవితే నా ప్రాణం – భావాల విహంగం,
అక్షరాల ఆకాశం, పదాల ప్రపంచం.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Comments
Post a Comment