తెలుగు తియ్యందనాలు


పలికితే

తేనెచుక్కలు చిందించాలి -

ఆలకించేవాళ్ళను

ఆనందసాగరంలో ఓలలాడించాలి.


పాడితే

తియ్యగా ఉండాలి -

శ్రోతలహృదులను

ఆనందాశ్చర్యాలలో ముంచెయ్యాలి.


పఠిస్తే

మధురంగా ఉండాలి -

కాయమును

కమ్మదనాలతో కుతూహలపరచాలి.


సేవిస్తే

కవనసుధలు చెరకురసంలా ఉండాలి -

తనువులకు

తృప్తినిచ్చి తన్మయత్వపరచాలి.


వింటే

మాటలు మాధుర్యం పంచాలి -

మదులను

మురిపించి మత్తెక్కించేలాగుండాలి.


పేరిస్తే

పదాలు చక్కెరపాకం పట్టినట్లుండాలి -

సాహితీ తియ్యదనాలను

చక్కగా తయారుచేసి అందించేలాగుండాలి.


విందునిస్తే

తొలుత సుకవితలతో నోర్లను తీపిచేయాలి -

ఆరగించేవార్లకు

ఆస్వాదించేలా తగిన ఏర్పాట్లుచెయ్యాలి.


రాస్తే

రమ్యంగా రసవత్తరంగా రాయాలి -

చదువరులను

సురసం క్రోలించి సంతసపరచాలి.


అజంత తెలుగుభాషను

తీపికి మారుపేరుగా నిలపాలి -

దేశంలోనే

అగ్రగామి స్థానముకు తీసుకెళ్ళాలి.


ఆంధ్ర అక్షరములును

గుండ్రని ముత్యాలని చాటాలి -

అవనిలోనే

అత్యున్నత హిమాలయశిఖరాలకు చేర్చాలి.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog