అక్షరాల ఆవిర్భావం…


కవితలు రాద్దామనుకున్నా —

కాగితం ఎదురు చూసింది,

కలం చేతివ్రేళ్లలోకి దూరింది,

మనసు మాటలను కుమ్మరించింది।


కవితలు వినిపిద్దామనుకున్నా —

గుండె గర్భంలో గుసగుసలు మోగాయి,

గొంతు తలుపులు తెరుచుకున్నాయి,

నిశ్శబ్దమే నాదమై శ్రావ్యతను చిందించింది।


తేటపలుకుల తేనెచుక్కలు చల్లుదామనుకున్నా —

పదాలు పరిమళాలై పూచాయి,

పలుకులు పూలవానై కురిశాయి,

పంక్తులు మాధుర్యమై ముందుకొచ్చాయి।


కవనాలను ప్రచార మాధ్యమాలకు పంపుదామనుకున్నా —

ఆలోచనలు రెక్కలు తొడుక్కొన్నాయి,

అక్షరాలు ఆకాశానికి ఎగిరాయి,

లోకాన్నంతా పలకరించి పులకరింపజేశాయి।


కమ్మగా పాడుదామనుకున్నా —

రాగాలు చిరుజల్లులై జారాయి,

భావాలు గానస్వరాలై మారాయి,

మనసులను మత్తెక్కించాయి।


పాఠక హృదయాలను తట్టాలనుకున్నా —

అక్షరం ఒక్కటే చాలు అనిపించింది,

ఆత్మను తాకే పలుకు,

అమృతంలా జారిపడింది।


కవితలు అనేవి —

కలం రాసిన గీతలు కావు,

మనసుల్ని ముట్టే మాధుర్యాలు,

లోకాన్ని ఓలలాడించే గాంధర్వ గానాలు॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog