మాటల మంత్రము – భావాల మాధుర్యము


వెలుగులు విరజిమ్మమంటారు—

వెలుతురు విత్తనాలను వెదజల్లమంటారు;

చీకటి చెరగాలంటే

చిరు జ్ఞాన దీపాల్ని వెలిగించమంటారు॥


వెన్నెలజల్లు కురిపించమంటారు—

వేదనల వేడి తగ్గించమంటారు;

మనసు మైదానాల్లో

మధుర స్వప్నాల్ని నాటమంటారు॥


చిరునవ్వులు చిందమంటారు—

చిరు ఆనందాల్ని పంచమంటారు;

వేదనల వర్షంలోనూ

వేడుకల్ని సమకూర్చమంటారు॥


పువ్వులు పూయించమంటారు—

పదాల తోటల్లో రంగులు చూపమంటారు;

భావాల కొమ్మల్లో

బంగారు కవితలు విరపూయించమంటారు॥


పరిమళాలు చల్లమంటారు—

ప్రేమ గాలిలో పులకింతలు కలపమంటారు;

మనసుల మడుల్లో

మాధుర్యపు మల్లెలు నింపమంటారు॥


అందాలు చూపమంటారు—

అక్షరాల్లో ఆత్మ సౌందర్యం ప్రతిఫలింపజేయమంటారు;

చూపుల చెరువుల్లో

చైతన్య చంద్రికను తేలియాడించమంటారు॥


ఆనందాలు అందించమంటారు—

అనుభూతుల అంచుల్లో ఆహ్లాద తరంగాలు రేపమంటారు;

జీవిత జలధిలో

జీవన గీతాలు వినిపించమంటారు॥


కవితలు అల్లమంటారు—

కాలపు కడలిలో కవన కెరటాలు లేవదీయమంటారు;

అక్షరాల ఆభరణాలతో

అంతరంగాలను అలంకరించమంటారు॥


మనసులు దోచమంటారు—

మాటల మంత్రంతో మానవ హృదయాలు గెలువమంటారు;

ప్రేమ పరిమళంతో

ప్రపంచాన్ని పూలవనంగా మార్చమంటారు॥


ఇలా అంటారు అందరూ—

కాని కవి గుండె మాత్రం చెబుతుంది—

"నేను కాదు వెలుగుల వర్షం,

మీ హృదయాలే నా కవితకు అసలు మూలం" 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog