కవితా మాధుర్యాలు


అక్షరాల తేనెలో

తెలే తీయని విషయము -

మదులను తట్టే

మధుర స్వర ప్రవాహము.


పదాల పూదోటలో

వెలువడే పరిమళం -

భావాల వెన్నెలలో

వెలిగేటి కాంతి సుమం.


కలము కార్చే

కమ్మని అమృత ధారలు -

ప్రతి పంక్తిలో కురిసే 

ప్రేమ సుగంధ జల్లులు.


లయలో సాగే

లాలిత్య స్రవంతులు -

మనసును తాకే

మధుర కాంతులు.


రమ్య రూపకాలు 

రంగుల రేఖలు -

రసాలు, రాగాలు

మిక్కిలి సోయగాలు.


పాడిన కవితతో

ప్రతిసారి జనించు -

శ్రోతల మదుల్లో

అమిత ఆనందాలు.


పలుకులు పూలై విప్పారితే

వెదజల్లు పరిమళాలు -

ప్రతి పంక్తి వెలుగైతే

విరజిమ్ము తళుకుబెళుకులు


మౌనం ఆవరిస్తే

కవిత గుప్పిస్తుంది మాటలు -

చెవులు కోరితే

మనసు పాడిస్తుంది మధురగీతాలు.


అక్షరమే ఆభరణము 

భావమే ప్రధానము -

మనసుకు కవితలే 

అమృత భాండాగారము.


కవితా మాధుర్యాలు

పారించు సౌరభాలు - 

చదువరుల హృదయాలు 

స్వీకరించు సుగంధాలు -


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog