కవితా మాధుర్యాలు
అక్షరాల తేనెలో
తెలే తీయని విషయము -
మదులను తట్టే
మధుర స్వర ప్రవాహము.
పదాల పూదోటలో
వెలువడే పరిమళం -
భావాల వెన్నెలలో
వెలిగేటి కాంతి సుమం.
కలము కార్చే
కమ్మని అమృత ధారలు -
ప్రతి పంక్తిలో కురిసే
ప్రేమ సుగంధ జల్లులు.
లయలో సాగే
లాలిత్య స్రవంతులు -
మనసును తాకే
మధుర కాంతులు.
రమ్య రూపకాలు
రంగుల రేఖలు -
రసాలు, రాగాలు
మిక్కిలి సోయగాలు.
పాడిన కవితతో
ప్రతిసారి జనించు -
శ్రోతల మదుల్లో
అమిత ఆనందాలు.
పలుకులు పూలై విప్పారితే
వెదజల్లు పరిమళాలు -
ప్రతి పంక్తి వెలుగైతే
విరజిమ్ము తళుకుబెళుకులు
మౌనం ఆవరిస్తే
కవిత గుప్పిస్తుంది మాటలు -
చెవులు కోరితే
మనసు పాడిస్తుంది మధురగీతాలు.
అక్షరమే ఆభరణము
భావమే ప్రధానము -
మనసుకు కవితలే
అమృత భాండాగారము.
కవితా మాధుర్యాలు
పారించు సౌరభాలు -
చదువరుల హృదయాలు
స్వీకరించు సుగంధాలు -
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment