మాటల మాధుర్యం


ఊసులు ఆడుతా —

ఊరంతా ఉయ్యాలలూగేలా,

ఊహల ఊటలు ఉప్పొంగేలా

హృదయాలను హత్తుకునేలా॥


ముచ్చట్లు చెబుతా — 

మమతల మల్లెలు పరిమళించేలా,

మురిపాల మధురిమలతో 

మనసులను మురిసించేలా॥


కబుర్లు పంచుతా — 

కలిసిమెలిసి బంధాలను బలపరచేలా,

కాలపు జ్ఞాపకాలను 

కళ్లముందు నిలిపేలా॥


వార్తలు వెల్లడిస్తా — 

వాస్తవాలను వెలికితీసేలా,

వివేకపు వేదికపై

విజ్ఞానదీపాలు వెలిగేలా॥


బాతాఖాని కొనసాగిస్తా — 

బరువైన మనసులు తేలికపడేలా,

బంధుత్వపు బాటల్లో 

బాసటగా నిలిచేలా॥


సంగతులు తెలుపుతా — 

సత్యసౌరభాలు వెదజల్లేలా,


సమాజ స్పందనలు పంచేలా,

సర్వులను సంతసింపజేసేలా॥


ఇష్టఘోష్టి కొనసాగిస్తా — 

ఇష్టాల ఇంద్రధనుస్సులు విరిసేలా,

ఇచ్చిపుచ్చుకునే ఆలోచనలకు 

కొత్త దారులు వేసేలా॥


మాటలు విరజిమ్ముతా —

మధురానుభూతుల ముత్యాలు చల్లేలా,

మనసు గాయాలకు 

మమతల మందుగా మారేలా॥


నవ్వులు పూయిస్తా — 

నిత్య వసంతాలు విరిసేలా,

నిరాశ మేఘాలను 

నిమిషంలోనే తరిమేసేలా॥


చర్చలు సాగిస్తా — 

చైతన్యచిగురులు తొడిగేలా,

చదువుకున్న ప్రతి అనుభవం 

జీవనపాఠాలు నేర్పేలా॥


మాటలు మంచివైతే 

మానవత్వం పరిమళిస్తుంది,

మాటలు మధురమైతే 

ప్రపంచమే ఒక కుటుంబమవుతుంది॥


ఊసులు ఆడుతా... ముచ్చట్లు చెబుతా...

మాటలతో మమతల వంతెనలు నిర్మిస్తా;

కబుర్లు పంచుతూ... హృదయాలను కలుపుతూ...

మానవత్వపు పరిమళాలను వెదజల్లుతా॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog