నా అక్షరాల అడుగుజాడలు


దేవులపల్లి కృష్ణశాస్త్రిలా రాయనా?

ప్రకృతి సోయగాలకు కవితాభిషేకం చేస్తూ,

హృదయవీణపై మధురరాగాలు పలికిస్తూ,

భావకవిత్వానికి మల్లెపందిరి కడుతూ రాయనా?


దాశరథిలా రాయనా?

తెలంగాణ నేల ఆవేదనను ఆలపిస్తూ,

స్వేచ్ఛా స్వప్నాలకు దీప్తినిస్తూ,

అణగారిన ఆత్మలకు ఆశాకిరణమై రాయనా?


శ్రీశ్రీలా రాయనా?

సంకెళ్లను సవాలు చేస్తూ,

శ్రమజీవి చెమటను చరిత్రగా మలుస్తూ,

అన్యాయాన్ని ప్రశ్నించే విప్లవ శంఖమై రాయనా?


సినారెలా రాయనా?

తెలుగు మాటలకు సంగీతస్పర్శనిస్తూ,

ప్రేమను పరిమళంగా చల్లి,

లాలిత్యసుధలను లోకానికి పంచుతూ రాయనా?


ఆరుద్రలా రాయనా?

ఆలోచనల లోతుల్లోకి దిగిపోయి,

కాలాన్ని ప్రశ్నిస్తూ,

జీవితరహస్యాలను జిజ్ఞాసకు జ్యోతులుగా వెలిగిస్తూ రాయనా?


ఆత్రేయలా రాయనా?

మనసు మౌనాన్ని మాటలుగా మార్చి,

ప్రేమకు ప్రాణం పోసి,

ఒక చిరునవ్వులోనే వేల భావాలను పలికిస్తూ రాయనా?


తిలక్‌లా రాయనా?

అంతరంగ అలజడిని ఆవిష్కరిస్తూ,

జీవితపు సూక్ష్మసత్యాలకు నిశ్శబ్దాన్నే నుడికారంగా చేస్తూ,

మనిషి మనసును అద్దంలా చూపిస్తూ రాయనా?


అలా కాదు... నాలా రాస్తాను.

నా కన్నీరు తెలిసిన కలంతో, నా నవ్వు నేర్చుకున్న అక్షరాలతో,

నా అనుభవం నింపిన భావాలతో, నా ఊహలకు రెక్కలు తొడిగి,

నా హృదయం కొట్టుకునే లయలో నా కవితలను రాస్తాను.


ప్రభావాలు దారి చూపవచ్చు;

ప్రతిభ మాత్రం తన దారిని తానే నిర్మించుకుంటుంది.

వారి వెలుగును వందనం చేస్తాను; వారి నీడలో నిలవను.

నేను ఎవరికీ ప్రతిరూపం కాదు... ఎవరి ప్రతిధ్వనినీ కాదు...


నా స్వరమే నా సంతకం,

నా శైలియే నా చిరునామా,

నా కవిత్వమే నన్ను పరిచయం చేస్తుంది...

నా అక్షరాల్లో నా ఆత్మస్వరమే ప్రతిధ్వనిస్తుంది!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog