పున్నమి వెన్నెల పున్నమి వెన్నెల పూసింది ఆకాశం - తేనె వెల్లువలా పారింది మాధుర్యం. జాబిలి చిందిన ముత్యాల జలధార - పుడమి ముఖముపైన జార్చె పసిడిహార. పొలాలపై మెరిసె వెండి ముసురు - గాలిలో తియ్యగా తేల్చె తిమిర సౌరభాలు. నదీ తీరాన యువకుల మదులందు - కౌముదిలో తేలాడె ప్రేమగాధల ఊహలు. తోటలోని పూలను తాకిన చంద్రిక - తేనెలా కరిగి చేరెను మనసుల. చెరువుల మీద ఆడగా చుక్కలచిలుకలు - చిమ్మె చందమామ చక్కని చిరునవ్వులు. పల్లె బాటలపైన పరచుకొన్న శ్వేతవర్ణము - మట్టివాసనతో నింపె హృదులందు మమకారము. పొగమంచునందు పారె పగటికలలు - ప్రతి కిరణము పాడె మౌనమేళము. చెట్టు గూళ్ళలో పక్షులు నిద్రించగా - గుప్పెడు మదులలో మెరిసె జ్వాలలు. ఆ కైరవిలో తట్టిన ఙ్ఞాపకాలు - దింపే ప్రణయంలో, లేపే విపరీతకోర్కెలు. సముద్ర తీరాన కెరటాలు ఆడగా - ఆకాశంలో చందిరిక నర్తించె మయూరిగా. నిశ్చబ్ధంలో మెరిసె తట్టెడు తలపులు - ఆ వెలుగే కవిత్వము ఆ నిశీధే భావము. నిండు పున్నమి చక్కని చంద్రాతపము - ప్రకృతి, ప్రీతి తడిమె కవులమదులను. పాఠకుల హృదులలో ముద్రవేసిన మృదురూపము - అయ్యె శాశ్వత మాధుర్యపు ఙ్ఞాపకాల సౌధము. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం